1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 ఆగస్టు 2021 (11:48 IST)

అస్సాం - మిజోరాం రాష్ట్రాల మధ్య మళ్లీచిచ్చు

ఈశాన్య భారత రాష్ట్రాలైన అస్సాం - మిజోరాం రాష్ట్రాల మధ్య మళ్లీ చిచ్చు చెలరేగింది. శనివారం రాత్రి అస్సాంలోని హైలాకంది జిల్లాలో జరిగిన బాంబు పేలుడులో ఓ ప్రైమరీ స్కూలు ధ్వంసమైంది. ఈ ఘటన ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చురేపేలా కనిపిస్తుంది.
 
నిజానికి గత కొన్ని రోజులుగా ఇరు రాష్ట్రాలమధ్య ప్రశాంతత నెలకొనివుంది. ఈ క్రమంలో తాజాగా అస్సాం - మిజోరాం రాష్ట్రాల మధ్య, మళ్ళీ ఉద్రిక్తత తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. శనివారం రాత్రి అస్సాంలోని హైలాకంది జిల్లాలో జరిగిన బాంబు పేలుడులో ఓ ప్రైమరీ స్కూలు ధ్వంసమైంది. 
 
ఈ జిల్లాలోని సాహెబ్ మీరా ప్రాంతంలో అర్థరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే.. అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ దీనిపై మిజోరాం ముఖ్యమంత్రితో సంప్రదిస్తానని తెలిపారు. 
 
తక్షణమే దర్యాప్తు జరిపించాలని ఆయనను కోరుతానని అలాగే ఈ ఘటన అస్సాంలో జరిగింది గనుక ఇక్కడ పోలీసు ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుందని ఆయన చెప్పారు. సరిహద్దుల్లో అక్కడక్కడా చెదురుమదురుగా చిన్నపాటి హింసాత్మక ఘటనలు జరగవచ్చునని ఇంటెలిజెన్స్ నివేదికలు సూచించాయని ఆయన చెప్పారు. 
 
ఉభయ రాష్ట్రాల మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాల్సిన బాధ్యత తమ ఇద్దరిమీదా ఉందని ఆయన చెప్పారు. ఇటీవల హిమంత శర్మ.. ఢిల్లీకి వెళ్లి.. సరిహద్దుల్లోని పరిస్థితిపై హోమ్ శాఖ అధికారులతోను, బీజేపీ నేతలతోనూ చర్చించారు.