గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 మే 2020 (12:14 IST)

బాంబే హైకోర్టు కీలక తీర్పు.. మైనర్ బాలిక గర్భం.. పిండాన్ని తొలగించవచ్చు...

బాంబే హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. అత్యాచారానికి గురైన ఓ మైనర్ బాలిక గర్భం దాల్చింది. అయితే బాధితురాలి కడుపులో పెరుగుతున్న 24 వారాల పిండాన్ని తొలగించుకోవడానికి న్యాయస్థానం అనుమతించింది. వైద్య నిపుణుల సలహా తీసుకున్న అనంతరం ఈ తీర్పు వెలువరించింది. మే 21న శస్త్రచికిత్స ద్వారా బాధితురాలి గర్భాన్ని విచ్ఛిత్తి చేయడానికి వైద్యులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 23 వారాల గర్భిణిగా ఉన్న 17 ఏళ్ల ఆ బాలిక.. మే 21 నాటికి 24 వారాల గర్భం దాల్చనుంది.
 
అత్యాచారానికి గురవడం ద్వారా గర్భం దాల్చిన తన కుమార్తె ప్రెగ్నెన్సీ తొలగించుకోవడానికి తక్షణమే అనుమతి ఇవ్వాలని కోరుతూ బాధితురాలి తల్లి మే 13న బాంబే హైకోర్టును ఆశ్రయించింది. గతేడాది జరిగిన అత్యాచారం కారణంగా తన బిడ్డ గర్భం దాల్చిందని ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం తన కుమార్తె తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తోందని.. అందువల్ల గర్భం తొలగించడానికి వెంటనే అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా తన కుమార్తె చదువుపై శ్రద్ధ పెట్టడానికి తోడ్పడుతుందని అభ్యర్థించారు.
 
బాలిక తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు మే 15న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర విచారణ చేపట్టింది. గర్భం తొలగించడం ద్వారా బాలికకు ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయా అనే అంశంపై నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం కోరింది. గర్భం తొలగింపు బాలికపై ఎలాంటి ప్రభావం చూపదనే అంశంపై స్పష్టత వచ్చిన వెంటనే తీర్పు చెప్పింది.