శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 9 జులై 2019 (14:24 IST)

చివరి అంకానికి కర్నాటక రాజకీయం... తదుపరి సీఎంగా యడ్డి?

కర్నాటక రాజకీయం తుది అంకానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత బీఎస్. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తనకు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు యడ్యూరప్ప ప్రకటించారు. దీంతో ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం మరింత కష్టాల్లో పడినట్టుగా చెప్పవచ్చు. 
 
కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ - జేడీఎస్‌లు కలిసి సంకీర్ణ సర్కారును నడుపుతుండగా, ముఖ్యమంత్రిగా హెచ్.డి. కుమార స్వామి ఉన్నారు. అయితే, ఆయనకు మద్దతు ఇస్తున్న పలువురు ఎమ్మెల్యేలు ఉపసంహరించుకున్నారు. ఈ సంఖ్య 14కు చేరింది. పైగా, అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నా వారు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా, రాజీనామా చేసిన వారికితోడు మరో ఇద్దరు అసంతృప్త ఎమ్మెల్యేలు జత కావడంతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏ క్షణాన్నైనా కుప్పకూలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం తరించుకున్నాయి. తన చేతిలో 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వెల్లడించారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇద్దరు గవర్నర్‌ను కలిసి తాము బీజేపీకి మద్దతు ఇస్తామని లేఖలు ఇచ్చారని, దీంతో తమ బలం 107కు చేరుకుందన్నారు. ఇప్పుడేం జరుగుతుందో చూద్దామని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 
 
మరోవైపు, సమస్య పరిష్కారమైందని, ఇక చింతించాల్సిన పనిలేదని, ప్రభుత్వం సాఫీగా సాగిపోతుందని ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించిన కాసేపటికే యడ్యూరప్ప ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. కాగా, రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలకు స్పీకర్ రమేశ్ కుమార్ మంగళవారం నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. రాజీనామాలు సరైన ఫార్మాట్‌లో ఇవ్వలేదని భావిస్తే విచారణను వాయిదా వేసే అవకాశం ఉంది.