గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (16:21 IST)

ఆ హెలికాఫ్టర్‌ వల్లే నా గేదె చనిపోయింది... పోలీసులకు రైతు ఫిర్యాదు

rajasthan farmer
అపుడపుడూ వెలుగులోకి వచ్చే కొన్ని సంఘటనలు చాలా ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని వినడానికే కాస్త ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా ఓ రైతు తన గేదె పోవడానికి ప్రధాన కారణం హెలికాఫ్టరేనంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని ఆల్వార్ జిల్లా బహ్‌రోడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే బల్జీత్ యాదవ్ వస్తున్నాడని స్వాగతించండానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఇందులోభాగంగా, తమ అభిమాన నాయకుడిపై హెలికాఫ్టర్ ద్వారా పూలవర్షాన్ని సైతం కురిపించారు. అయితే, ఆ హెలికాఫ్టర్ ఆ ప్రాంతంలో పలుమార్లు బహ్‍రోడ్ ప్రాంతంలో చక్కర్లు కొట్టింది. 
 
ఆ తర్వాత కోహ్రానా అనే గ్రామం మీదుగా వెళ్లిపోయింది. ఈ హెలికాఫ్టర్ తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల పెద్ద శబ్దం వచ్చింది. ఈ హెలికాఫ్టర్ శబ్దానికి రూ.1.5 లక్షల విలువ చేసే తన గేదె మృతి చెందిందని ఆ గ్రామానికి చెందిన బల్వీర్ అనే వృద్ధుడు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. గేదె ఖళేబరాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిమిత్తం సమీపంలోని వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. ఈ పరీక్ష ద్వారా గేదె ఎలా చనిపోయిందో తెలుస్తుందని, ఆ తర్వాత ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.