శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 జనవరి 2021 (13:58 IST)

ఉరకలేస్తున్న ఆంబోతులు.. జోరుగా జల్లికట్టు పోటీలు....

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మిన్నంటున్నాయి. ఈ వేడుకల్లో అతిముఖ్యమైన ఘట్టమైన జల్లికట్టు పోటీలు రాష్ట్ర వ్యాప్తంకా జరుగుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ పోటీలు మూడు రోజులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా, తొలిరోజైన గురువారం అవనియాపురంలో ఈ జల్లికట్టు పోటీలు జరిగాయి. ఈ వేడుకల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొని జల్లికట్టు పోటీలను తిలకించారు. 
 
వాస్తవానికి జల్లికట్టు... ఈ పేరు వింటేనే తమిళుల్లో ఉత్సాహం ఉప్పొంగుతుంది. పొంగల్ పండుగ సీజన్‌లో నిర్వహించే ఈ పురాతన సంప్రదాయ క్రీడలో పాల్గొనడాన్ని గ్రామీణ తమిళులు అమితంగా ఇష్టపడతారు. ఓసారి జల్లికట్టుపై నిషేధం విధించిన సమయంలోనూ వారు సంఘటితంగా పోరాడి తమ ప్రాచీన సంప్రదాయన్ని తిరిగి దక్కించుకున్నారు. 
 
తాజాగా, పొంగల్ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు సందడి కనిపిస్తోంది. మదురై జిల్లాలోని అవనియపురంలో గురువారం జల్లికట్టు పోటీలు షురూ అయ్యాయి. ఎంతో బలిష్టమైన ఎద్దులను అదుపు చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు.
 
కాగా, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టుపై పలు ఆంక్షలు విధించింది. ఇందులో పాల్గొనేవారు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ అయ్యుండాలని, ఆ విషయం నిరూపిస్తూ సర్టిఫికెట్ సమర్పించాలని పేర్కొంది. జల్లికట్టులో పాల్గొనే పోటీదారుల సంఖ్యను 150కి పరిమితం చేసింది. పైగా, ప్రేక్షకులు కూడా 50 శాతం మించకూడదని స్పష్టం చేసింది.
 
మరోవైపు, ఈ పోటీలను తిలకించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి మదురైకు విచ్చేశారు. ఆయన డిఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ నిధితో పాటు.. టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరితో కలిసి పాల్గొన్నారు.