1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (11:14 IST)

టీకాలపై అనుమానాలు వద్దు : సుప్రీంకోర్టు

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా సాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ (టీకా)పై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ టీకాలను ప్రజలందరికీ ఇవ్వడాన్ని నిలుపుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన అప్పీలును కొట్టివేసిన సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది. 
 
అన్ని దశల క్లినికల్‌ పరీక్షలు ఇంకా పూర్తికానందున వీటిని ప్రజలందరికీ ఇవ్వకూడదంటూ ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని తొలుత కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. అలాగే, రూ.50 వేల జరిమానా కూడా విధించింది. 
 
దీనిపై వారు సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 'పిటిషన్‌ను కొట్టివేసి హైకోర్టు సరైన నిర్ణయమే తీసుకుంది. వాక్సినేషన్‌ ప్రక్రియపై అనుమానాలు వద్దు. ప్రజలను రక్షించడానికి ఇవే కీలకమైనవి' అని పేర్కొంది.