గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఒకే దేశం - ఒకే ఎన్నిక : మరోమారు తెరపైకి తెచ్చిన బీజేపీ!!

election commission
ఒకే దేశం.. ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికల) అంశాన్ని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మరోమారు తెరపైకి తెచ్చింది. ఒకే దేశం - ఒకే ఎన్నిక అన్న తమ ఎన్నికల హామీ ముందుకు ఈ దఫాలోనే ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ తన భాగస్వామ్య పార్టీలతో కలిసి సిద్ధమవుతుంది. ప్రస్తుత ఎన్డీయే పాలనలోనే జమిలి ఎన్నికల నిర్వహణ మొదలవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. జమిలి ఎన్నికలకు సంబంధించి త్వరలో పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ సమయంలో ఈ అంశం తెరపైకి రావడం గమనార్హం. 
 
గత నెల స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని మోడీ ఎర్రకోట నుంచి జమిలి ఎన్నికలను ప్రస్తావించారు. దేశ వ్యాప్తంగా ఏటా ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతుందంటూ వ్యాఖ్యానించారు. దీని నుంచి బయటపడాలంటే జమిలి ఎన్నికలో పరిష్కారమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దిశగా అన్ని రాష్టరాలు ముందుకు రావాలని కూడా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. 
 
ఈ క్రమంలోనే మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటయింది. తొలి దశల్లో లోక్‌సబ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మార్చిలో ప్రతిపాదించారు. వంద రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని, దేశ వ్యాప్తంగా ఎన్నికల చక్రాన్ని సమకాలీకరించాలని కమిటీ సిఫార్సు చేసింది. దీంతో జమిలి ఎన్నికల అంశం మరోమారు తెరపైకి వచ్చింది.