1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 ఆగస్టు 2023 (17:21 IST)

చంద్రయాన్-3 ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌కు టైమ్ ఫిక్స్...

chandrayaan-3
కోటాను కోట్ల మంది ప్రజానీకం ఎంతో ఆసక్తిగా చూస్తున్న కీలక ఘట్టానికి చంద్రయాన్‌- 3 ల్యాండర్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే ల్యాండర్‌ రెండో, చివరి డీ-బూస్టింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ... జాబిల్లిపై అది దిగే సమయాన్ని వెల్లడించింది. ఆగస్టు 23న సాయంత్రం 6.04 సమయంలో చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌ అడుగుమోపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను ఆయా వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపింది.
 
'సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ఒక చారిత్రక ఘట్టంగా నిలుస్తుంది. భారత శాస్త్రసాంకేతికత సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచే ఈ ప్రక్రియ.. అందరిలో ఉత్సుకతను కలిగించడమే కాకుండా యువతలో ఆవిష్కరణలు, అంతరిక్ష అన్వేషణల పట్ల ఇష్టాన్ని పెంచుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 5.27 గంటల నుంచి ల్యాండింగ్‌ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్‌ ఛానెల్, ఫేస్‌బుక్‌ పేజీ, డీడీ నేషనల్ టీవీ ఛానెల్‌ సహా ఆయా ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉంటుంది' అని ఇస్రో తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ఈ ఈవెంట్‌ను ప్రచారం చేయాలని, ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేయాలని పిలుపునిచ్చింది.
 
ఇదిలావుంటగా, జాబిల్లిపై పరిశోధనలకుగానూ జులై 14న 'చంద్రయాన్‌-3'ని ప్రయోగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యుల్‌ చంద్రుడి నుంచి అత్యల్పంగా 25 కి.మీ, అత్యధికంగా 134 కి.మీ దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఇక చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగడమే తరువాయి. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం 6.04 సమయంలో చంద్రుడిపై ల్యాండర్‌ అడుగుపెడుతుంది.