1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (09:09 IST)

జాబిల్లికి మరింత చేరువైన 'చంద్రయాన్-3' : కక్ష్యను కుదించిన ఇస్రో శాస్త్రవేత్తలు

chandrayaan
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం ఇప్పటివరకు సాఫీగానే సాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా, జాబిల్లికి చంద్రయాన్-3 మరింత చేరువైంది. ఆదివారం రాత్రి కక్ష్య కుదింపు చర్యను చేపట్టినట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో జాబిల్లికి చంద్రయాన్ మరింత దగ్గరైందని, ఇదేవిధంగా కక్ష్య కుదింపు చర్యలు మరో రెండు ఉన్నాయని వారు వెల్లడించారు. అన్నీ సవ్యంగా సాగితే ఈ నెల 23వ తేదీన చంద్రయాన్-3 వ్యోమనౌక జాబిల్లిపై దిగుతుందని వారు తెలిపారు.
 
కాగా, ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 గంటల మధ్య చంద్రయాన్-3 జాబిల్లికి మరింత దగ్గరయ్యేలా మరో చిన్న కక్ష్యలోకి ప్రవేశపెడతామని వారు తెలిపారు. ఆ తర్వాత రెండు సార్లు కక్ష్య మార్పు కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు. ఆఖరులో చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి చంద్రయాన్-3ని చేర్చుతారు. 
 
ఆ పిమ్మట ఈ నెల 23వ తేదీన చంద్రుడిపై దించుతారు. చంద్రయాన్-3 వ్యోమనౌకను గత నెల నెలలో శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి ప్రయోగించిన విషయం తెల్సిందే. తొలుత భూమి చుట్టూ పరిభ్రమిస్తూ వేగం పుంజుకున్న వ్యోమనౌక శనివారం జాబిల్లి కక్ష్యలోకి తొలిసారిగా ప్రవేశించిన విషయం తెల్సిందే.