ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2023 (15:59 IST)

అరుణాచల్ ప్రదేశ్‌కు హోం మంత్రి అమిత్ షా - డ్రాగన్ కంట్రీ అభ్యంతరం

amit shah
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు వెళ్లారు. దీనికి చైనా తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లో అమిత్ షా పర్యటించడంపై చైనా డ్రాగన్ కంట్రీ అసహనం వ్యక్తం చేసింది. ఈ రాష్ట్రంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారిక కార్యక్రమాలు చేపట్టడం చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. 
 
సోమవారం అమిత్‌షా ఆ రాష్ట్రంలో చైనా సరిహద్దున ఉన్న కిబితూ గ్రామంలో వైబ్రెంట్‌ విలేజ్ ప్రోగ్రాం(వీవీపీ)ను ప్రారంభించనున్నారు. ఆయన ఇప్పటికే అస్సాంలోని దిబ్రూగఢ్‌తు చేరుకొన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో రెండు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. దీనిలో భాగంగా ఆయన ఐటీబీపీ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. భారత్‌-చైనా మధ్య అరుణాచల్‌ ప్రదేశ్‌పై మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో షా ఆ రాష్ట్రంలో పర్యటించనుండటం విశేషం. 
 
కాగా, ఈ నెల రెండో తేదీన చైనా అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని 11 ప్రదేశాలకు మాండరీన్‌ పేర్లను పెట్టింది. ఈ విషయాన్ని చైనా పౌరవ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ మేరకు అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌గా చూపిస్తున్న మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో షా పర్యటనపై ఓ ఆంగ్ల వార్త సంస్థ చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ను ప్రశ్నించగా, 'జాంగ్‌నన్‌' (అరుణాచల్‌ ప్రదేశ్‌కు చైనా పెట్టిన పేరు) చైనా భూభాగం. అక్కడ భారత అధికారులు పర్యటించడం మా భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే. ఈ చర్య శాంతికి ఏమాత్రం తోడ్పడదు’’ అని పేర్కొన్నారు. 
 
అమిత్‌షా తన పర్యటనలో భాగంగా తొమ్మిది మైక్రో హైడల్‌ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. దీంతోపాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కేంద్రపాలిత ప్రాంతమైన లద్ధాఖ్‌లలోని 19 జిల్లాల్లో 46 బ్లాక్స్‌లో 2,967 గ్రామాల్లో వీవీపీ పథకం కింద పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.