శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (10:02 IST)

నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు - మనస్సు మార్చుకున్న శశిథరూర్

congress symbol
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠానికి సోమవారం ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యాయి. ఈ పోటీలో గాంధీ కుటుంబ అండదండలు పుష్కలంగా కలిగిన కర్నాటక కాంగ్రెస్ వృద్ధినేత మల్లికార్జున ఖర్గేతో కేరళకు చెందిన మరో సీనియర్ నేత శశిథరూర్ పోటీపడుతున్నారు. అయితే, ఆయన చివరి నిమిషంలో తన మనస్సు మార్చుకున్నారు. ఈ ఎన్నికల్లో తనకు ఏమాత్రం గెలుపు అవకాశాలు లేవని గ్రహించిన శశి థరూర్.. ఖర్గేతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 
 
మరోవైపు, 137 యేళ్ల సుధీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోనూ, భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ తన ఓటును కర్నాటకలోని బళ్ళారిలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే, మరో 140 మంది ప్రతినిధులు కూడా ఇక్కడే ఓటు వేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
ఇదిలావుంటే, కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్రోరల్ కాలేజీలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులతో సహా మొత్తం 9 వేల మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంతో పాటు దేశ వ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.