1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (15:44 IST)

ఇండియా పేరును భారత్‌ అని మార్చాలా? అదో మూర్ఖపు డిమాండ్..?

ఇండియా పేరును భారత్‌ లేదా హిందుస్థాన్ అని మార్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ సాగింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో ఇండియా దటీజ్ భారత్ అని ఉందని పిటిషనర్‌కు చెప్పారు. ఈ విషయంలో కావాలనుకుంటే కేంద్రం వద్దకు వెళ్లాలని సూచించారు. సంబంధిత మంత్రిత్వ శాఖకు పిటీషన్ పంపవచ్చని సూచన చేశారు. పిటిషన్‌ను కొట్టివేశారు.
 
కాగా, ఇండియా పేరును భారత్ లేదా హిందూస్థాన్ అని మార్చడం వల్ల ప్రజల్లో ఆత్మ గౌరవం, జాతీయ భావం పెంపొందుతాయని ఢిల్లీకి చెందిన పిటిషనర్ తన పిటిషన్‌లో వివరించారు. దేశం పేరు మార్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో సవరణలు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. ఇండియా అనేది ఆంగ్లపదమని, స్వదేశీ భాషలో పెడితే దేశ ప్రజలకే గర్వకారణంగా ఉంటుందని పిటిషనర్ సూచించారు. 1948లోనూ భారత్ లేదా హిందూస్థాన్‌లో ఏదో ఒక పేరు పెట్టాలనే వాదన వచ్చిందని పిటిషనర్ గుర్తు చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఇండియా పేరును భారత్ లేదా హిందుస్థాన్‌ అని మార్చాలంటూ వచ్చిన డిమాండ్ 'మూర్ఖపు డిమాండ్' గా అభివర్ణించారు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ. ఈ డిమాండ్ అనవసర రాద్ధాంతంగా కొట్టి పారేశారు. రాజ్యాంగ రూపకర్తలు రాజ్యాంగాన్ని రచించే సమయంలో 'ఇండియా' అయితే బాగుంటుందని నిశ్చయానికి వచ్చారని, దానికి ప్రజల సెంటిమెంట్ కూడా తోడైందని మొయిలీ పేర్కొన్నారు.