గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (15:29 IST)

సెప్టెంబరు నాటికి కరోనా వ్యాక్సిన్.. తొలుత ఆరోగ్య కార్యకర్తలకే..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు వచ్చే యేడాది సెప్టెంబరు నాటికి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్థన్ వెల్లడించారు. అయితే, ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తొలుత ఆరోగ్య కార్యకర్తలకే ఇస్తామని ఆయన తేల్చి చెప్పారు.
 
ఇదే అంశంపై ఆయన ఓ జాతీయ న్యూస్ ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వ్యాక్సిన్ సామర్థ్యం, భద్రత అనే రెండు అంశాలే ప్రాధాన్యంగా తాము ముందుకు సాగుతున్నామని అన్నారు. వ్యాక్సిన్ విషయంలో మొదటి ప్రాధాన్యం ఎవరికిస్తారని ప్రశ్నించగా... ఆరోగ్య కార్యకర్తల జాబితా ఒకటి తయారవుతోందని, దానిని త్వరలోనే అప్‌లోడ్ చేస్తామని వెల్లడించారు. 
 
ఆరోగ్య కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యమని... ఆ తర్వాత పోలీసులు, పారామిలటరీ ఆ తర్వాత 65 ఏళ్ల వయసు పైబడిన వారు.... ఇలా ఓ జాబితాను తయారు చేస్తామని ఆయన తెలిపారు. ఇక రెండో జాబితాలో 50 ఏళ్ల వారు, వేర్వేరు రోగాలతో బాధపడుతున్న వారికి అందజేస్తామన్నారు. కరోనాతో పోరడడానికి ప్రభుత్వాలు ప్రజల్ని నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉన్నాయని, కరోనా ప్రోటోకాల్ కచ్చితంగా పాటిస్తున్నారని అన్నారు. 
 
కరోనా కారణంగా పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారినా...దేశంలో పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. 90 లక్షల రోగుల్లో దాదాపు 85 లక్షల మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారని, ప్రపంచంతో పోలిస్తే భారత్‌లోనే రికవరీ రేటు అధికంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కొన్ని నగరాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆ ప్రాంతాల్లో మాత్రం కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని హర్షవర్ధన్ విజ్ఞప్తి చేశారు.