శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (15:35 IST)

ఢిల్లీ సరిహద్దుల్లో తిష్టవేసిన రైతులు... నిరసన ప్రాంతంలో కోవిడ్ సూపర్ స్పైడర్?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో తిష్టవేశారు. వీరు చేపట్టిన 'ఛలో ఢిల్లీ' కార్యక్రమాన్ని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా సరిహద్దుల్లోనే బస చేస్తూ, ఢిల్లీకి వచ్చే రహదారులను దిగ్బంధం చేశారు. 
 
అయితే, వేలాది మంది రైతులు ఇలా ఒకేచోట గుమికూడటంతో కరోనా వైరస్ సూపర్ స్పైడర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిజానికి గత కొన్ని రోజులుగా ఢిల్లీలో సెకండ్ వేవ్ మొదలైందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఒకేచోట ఉండటంతో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపించేందుకు ఆస్కారం ఉందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. 
 
అందుకే పలువురు వైద్యులు స్వచ్ఛందంగా శిబిరం ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిరసన స్థలంలో నిరసన స్థలంలో కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడంతో పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైద్యులు కోరుతున్నారు. నిరసన ప్రాంతానికి సూపర్‌ స్ప్రెడర్స్‌ వచ్చే అవకాశం ఉంటే.. ఇతర వ్యక్తులకు మహమ్మారి వ్యాప్తి చెందుతుందని డాక్టర్‌ కరణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ సందర్భంగా వైద్యులు మహమ్మారి మధ్య సామాజిక దూరం, భద్రతా మార్గదర్శకాలపై నిరసనకారులకు అవగాహన కల్పించారు. గురుగ్రామ్‌లోని ఈఎన్‌టీ సర్జన్‌ డాక్టర్‌ సారికాశర్మ మాట్లాడుతూ ఆందోళన కార్యక్రమం వద్ద పలు సదుపాయాలు అవసరమని పలువురు స్నేహితులు సమాచారం ఇచ్చారని, ఈ మేరకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, మాస్క్‌లు, అవసరమైన మందులు తీసుకువచ్చినట్లు చెప్పారు. 
 
ఆందోళనలో పలువురు రైతులకు గాయాలయ్యాయని, వారికి చికిత్సలు చేసి, మందులు అందజేశామన్నారు. చాలా మంది మాస్క్‌లు లేకుండా తిరుగుతున్నారని, వారికి కొవిడ్‌ నియమాలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. రైతుల డిమాండ్లను కేంద్రం పరిశీలించాలని, రోజుల తరబడి గుమిగూడడానికి అనుమతించొద్దని సారిక ప్రభుత్వాన్ని కోరారు.