శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (19:33 IST)

ఢిల్లీ అల్లర్లు: ఉచిత కరెంట్, ఉచిత నీరు కోసం ఓటు వేస్తే ఇలా అవుతుందనుకోలేదు?

ఢిల్లీ చాంద్ బాగ్‌లో విధ్వంసానికి, ఐబి అసిస్టెంట్ అంకిత్ శర్మ హత్యకు ప్రధాన కారకుడు “ఆమ్ ఆద్మీ పార్టీ” ( ఆప్) కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ అని స్థానికులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. స్వయంగా అంకిత్ శర్మ తల్లిదండ్రులు కూడా తాహిర్ హుస్సేన్, ఆయన మద్దతుదారులే తమ కుమారుడి హత్యకు కారకులని వాపోతున్నారు. ఈ నేపధ్యంలో పరారీలో ఉన్న తాహిర్ హుస్సేన్ కోసం ప్రత్యేక పోలీసు బృందాల వేట ప్రారంభమైంది.
 
ఉచిత కరెంట్, ఉచిత నీరు కోసం “ఆప్”కు ఓటు వేస్తే, తాహిర్ హుస్సేన్ లాంటి దుర్మార్గులు రాజకీయ వ్యవస్థలోకి వచ్చారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పుడు “ఆప్”కు ఓటు ఎందుకు వేశామా అని అంటున్నారు. తాహిర్ హుస్సేన్ దారుణమైన వ్యక్తి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని సాక్ష్యాధారాలతో తాహిర్ హుస్సేన్ దోషి అని నిరూపణ కావడం ఖాయమని అంటున్నారు.
 
అంకిత్ శర్మ మృత దేహం లభించిన మురుగు కాలువ వద్ద ఫోరెన్సిక్ నిపుణులు సాక్ష్యాలను సేకరిస్తున్నారు. హింస, విధ్వంసం సృష్టించేందుకు ముందస్తుగా, ఓ పధకం ప్రకారం తన ఇంటిని తాహిర్ హుస్సేన్ ఆయుధగారంగా మార్చిన వైనాన్ని క్రైమ్ పోలీసుల బృందం అణువణువూ గాలించి సాక్ష్యాలను సేకరించింది. 
త్వరలోనే తాహిర్ హుస్సేన్‌ను పట్టుకుంటామని పోలీసులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
 
తాహిర్ హుస్సేన్‌ను ప్రధమ ముద్దాయిగా పోలీసులు కేసు నమోదు చేశారు. హింస, విధ్వంసానికి ముందు ఫోన్లో పలు ధపాలు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో తాహిర్ హుస్సేన్ మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పాపం తాహిర్ హుస్సేన్‌కే పరిమితమౌతుందా, లేదా పలువురు ఇతర నేతలకు కూడా చుట్టుకుంటుదా అనేది త్వరలోనే దర్యాప్తులో తేటతెల్లం కానుంది.