1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (14:23 IST)

మద్యం మత్తులో ఒంటిమీదున్న బట్టలన్నీ ఇప్పేశాడు.. అదీ విమానంలో..?

మద్యం మత్తులో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్‌ ఏషియా విమానంలో ఓ ప్రయాణికుడు రెచ్చిపోయాడు. మద్యం మత్తులో బట్టలు విప్పేసి బీభత్సం సృష్టించాడు. సిబ్బందితో అమర్యాదగా, అసభ్యంగా ప్రవర్తించాడు.
 
తొలుత లైఫ్‌ జాకెట్ల గురించి అతగాడు సిబ్బందితో వాదనకు దిగాడు. ఆ తర్వాత రెచ్చిపోయాడు. ఉన్నట్టుండి ఒంటిమీదున్న బట్టలన్నీ ఇప్పేశాడు. అతడి చర్యతో సిబ్బంది, తోటి ప్రయాణికులు షాక్‌కి గురయ్యారు. ఏప్రిల్‌ 6న ఐ5-722 విమానంలో ఈ అవాంఛనీయ ఘటన జరిగింది.
 
ఈ ఘటనపై ఎయిర్‌ ఏషియా ఇండియా ఎయిర్‌లైన్స్‌ సంస్థ అధికార ప్రతినిధి స్పందించారు. తాగిన మత్తులో ఉన్న ప్రయాణికుడు తమ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడని తెలిపారు. తోటి ప్రయాణికులతో కలిసి సిబ్బంది పదేపదే విజ్ఞప్తి చేయడంతో చివరకు కూర్చున్నాడని చెప్పారు. ఆ తర్వాత దీని గురించి పైలట్లకు సమాచారం ఇచ్చారని వివరించారు.
 
జరిగిన ఘటనపై ఢిల్లీలోని ఏటీసీకి పైలెట్ సమాచారం అందించి, త్వరగా ల్యాండింగ్‌కు అనుమతించాలని కోరారని తెలిపారు. విమానం ఢిల్లీలో ల్యాండింగ్‌ కాగానే, అతడిని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి అప్పగించామన్నారు. 
 
దీనిపై ఢిల్లీ ఎయిర్‌ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశామని, అతడిపై తగు చర్యలు తీసుకోవాలని కోరామని ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు. ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.