1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (14:27 IST)

పంజాబ్ రాజకీయం రసవత్తరం : బీజేపీలోకి కెప్టెన్?

పంజాబ్ రాజకీయాలు రోజుకోరీతిలో మారిపోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ఇపుడు కాంగ్రెస్ పార్టీతో పాటు.. పంజాబ్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. 
 
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాటలు విని తనను సీఎం పీఠ నుంచి తొలగించడాన్ని మాజీ ముఖ్యమంత్రి అమరీదర్ సింగ్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులోభాగంగా, ఆయన బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాతో సమావేశమయ్యేందుకు హస్తిన బాట పట్టినట్టు సమాచారం. 
 
ఈ పరిణామంతో పంజాబ్‌ రాజకీయం మరింత వేడెక్కింది. అయితే అమరీందర్‌ సింగ్‌ బీజేపీలో చేరితే మాత్రం కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బ తగలనుంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో విబేధాలు తారస్థాయికి చేరాయి.
 
ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు, అమరీందర్‌ సింగ్‌కు అసలు పొసగడం లేదు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈ విబేధాలు కొనసాగుతున్నాయి. అయితే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం మధ్యే మార్గంగా అమరీందర్‌సింగ్‌ను దింపేసి దళిత వర్గానికి చెందిన చన్నీని ముఖ్యమంత్రిగా నియమించింది. దీంతో అమరీందర్ సింగ్ పార్టీకి దూరంగా ఉంటున్నారు.