బంగారం స్మగ్లింగ్ కేసు : అధికారులు కొట్టలేదు ప్రశ్నలతో వేధించారు : రన్యా రావు
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన కన్నడ నటి రన్యా రావు తనను విచారించిన డీఆర్ఐ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటరాగేషన్లో అధికారులు తనను కొట్టలేదని కానీ వివిధ రకాలైన ప్రశ్నలు సంధించి వేధించారంటూ ఆరోపించారు. దీంతో తాను మానసిక వేదనకు గురైనట్టు ఆమె కోర్టుకు తెలిపారు.
అయితే, రన్యా రావును విచారణ సమయంలో ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని దర్యాప్తు అధికారి కోర్టుకు తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వడం లేదని, ప్రతి ప్రశ్నకు మౌనంగా ఉంటున్నారని చెప్పారు. ఆధారాలు చూపించి అడిగినా, సమాధానం మాత్రం చెప్పడం లేదన్నారు. రన్యారావు కోర్టు వద్దకు రాగానే ఏం మాట్లాడాలో తన న్యాయవాదులు చెప్పారని, దర్యాప్తు ప్రక్రియను తాము రికార్డు చేశామని కోర్టుకు తెలిపారు.
మాటలతో వేధించిన అంశంపై మీ న్యాయవాదులు పిటిషన్ ఎందుకు వేయలేదని కోర్టు నటిని ప్రశ్నించింది. దర్యాప్తునకు సహకరిస్తున్నానని, కానీ, గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి పేపర్లపై సంతకాలు చేయమని ఒత్తిడి చేస్తున్నారని రన్యారావు తెలిపారు. అయితే, భయపడాల్సిన అవసరం లేదని, ఏమైనా ఆందోళనలు ఉంటే మీ లాయర్ల ద్వారా చెప్పి పిటిషన్ వేయవచ్చని కోర్టు సూచించింది. విచారణ అనంతరం రన్యారావుకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీని కోర్టు విధించింది.