1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (18:32 IST)

మరో మూడు వారాలు లాక్‌డౌన్ అవసరం : కేంద్రమంత్రి హర్షవర్థన్

దేశంలో ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇది ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. ఈ పొడగింపుపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్థన్ స్పందించారు. కరోనా వైరస్‌ కట్టడికి ఇంకా మూడు వారాల లాక్‌డౌన్‌ అవసరమని అభిప్రాయపడ్డారు. 
 
ఆయన శుక్రవారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్పరెన్స్‌ను నిర్వహించారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్‌ చౌబేతో కలిసి ఢిల్లీలోని నిర్మాణ్‌ భవన్‌ నుంచి హర్షవర్దన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా కట్టడికి వివిధ రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. 
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, కరోనా చైనా నుంచి మిగిలిన దేశాలకు విస్తరించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా 212 దేశాలకు వ్యాపించిందన్నారు. కరోనాపై యుద్ధానికి అందరూ సహకరిస్తున్నారన్నారు. కరోనాకు సరిహద్దులంటూ ఏమీ లేవని, కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. 
 
కరోనా వ్యాక్సిన్‌ తయారీకి ప్రయోగాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. కరోనాను తరిమికొట్టడంలో అందరూ మాస్కులు ధరించడం అత్యంత ప్రధానం అని పేర్కొన్నారు.