1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 మే 2023 (11:15 IST)

మోడీ... దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తొమ్మిదేళ్లు

narendra modi
నరేంద్ర మోడీ.. దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మంగళవారం (మే 30వ తేదీ) నాటికి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. దీంతో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో తాను తీసుకున్న నిర్ణయం ప్రజల జీవితాలను మెరుగుపరచడం కోసమేనని చెప్పారు. ఈ పదవీకాలాన్ని తొమ్మిదేళ్ల సేవగా ఆయన అభివర్ణించారు.
 
"దేశ సేవలో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో నేనెంతో వినమ్రత, కృతజ్ఞతా భావంతో ఉన్నాను. ఇన్ని సంవత్సరాల్లో తీసుకున్న ప్రతి నిర్ణయం, ప్రతి చర్య.. ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి ఉద్దేశించినవే. అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించేందుకు ఇంతకంటే ఎక్కువగా శ్రమిస్తాను'' అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. 
 
మరోవైపు, తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భాజపా ఈ రోజు భారీ ప్రచార కార్యక్రమాలకు తెరతీసింది. 'స్పెషల్ కాంటాక్ట్ క్యాంపెయిన్' పేరిట నెల రోజుల పాటు దీనిని నిర్వహిస్తుంది. 'నేషన్ ఫస్ట్‌' అనే నినాదంతో ఈ సమయంలో దేశం అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధిని సాధించిందని భాజపా ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, నరేంద్ర మోడీ గత 2014, మే 26వ తేదీన తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2019, మే 30న ఆయన రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.