1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (09:46 IST)

హుజురాబాద్ బైపోల్ : 172 పోలింగ్‌ కేంద్రాల్లో కాంగ్రెస్‌కు సింగిల్‌ డిజిట్‌..

తెలంగాణా రాష్ట్రంలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరపరాజయాన్ని చవిచూసింది. నియోజకవర్గంలోని 306 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 22 రౌండ్లలో ఓట్లు లెక్కించగా కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకటనర్సింగ రావుకు కేవలం 3,012 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 
 
గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 60,604 ఓట్లు పోలవ్వగా ఈసారి ఉప ఎన్నికల్లో కేవలం ఐదు శాతానికి మించలేదు. ఏకంగా 172 పోలింగ్‌ కేంద్రాల్లో సింగిల్‌ డిజిట్‌ ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో 134 పోలింగ్‌ కేంద్రాల్లో 10 కంటే ఎక్కువగా ఓట్లు వచ్చాయి. 71, 72, 107, 281 పోలింగ్‌ కేంద్రాల్లో కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. 
 
కాంగ్రెస్‌ అధిష్టానం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆలస్యం చేయడం, చివరకు స్థానికేతరుడైన బల్మూరి వెంకటనర్సింగరావును బరిలో దింపటం పార్టీకి ప్రతికూలంగా మారిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
పైగా భాజపా, తెరాస నేతలు హోరాహోరీగా ప్రచారం చేయగా, అదే స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ చేయలేకపోయింది. మొత్తంగా ఉప ఎన్నికల్లో భాజపా, తెరాస మధ్య నువ్వానేనా అన్నట్లు సాగింది తప్ప కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడా పోటీ ఇవ్వలేదు.