1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (15:42 IST)

హెలికాఫ్టర్ మృతులకు పూలవర్షంతో వీడ్కోలు పలికిన స్థానికులు

నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలో బుధవారం హెలికాఫ్టర్ కూలి ప్రాణాలు కోల్పోయిన మృతులకు స్థానికులు కన్నీటితో అంజలి ఘటించారు. భౌతికకాయాలు కలిగిన శవపేటికలను వారివారి స్వస్థాలకు తరలించేందుకు వ్యానుల్లో ఎక్కించి తరలించారు. ఆ వాహనాలు వచ్చిన రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన స్థానికులు పూలవర్షం కురిపిస్తూ, కన్నీటితో తుది వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
కాగా, ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్‌తో పాటు మరో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ భౌతికకాయాలను నీలగిరి జిల్లా మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ నుంచి సులూర్ ఎయిర్‌బేస్‌కు అంబులెన్స్‌లలో తరలించారు. 
 
ఈ సందర్భంగా స్థానికులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. బిపిన్ రావత్, ఆయన అర్థాంగి, ఇతర సిబ్బంది భౌతికకాయాలను తీసుకెళుతున్న అంబులెన్స్‌లపై స్థానికులు పూలవర్షం కురిపించారు. అనంతరం వారి మృతదేహాలను సులూర్ ఎయిర్‌బేస్‌కు తరలించి, అక్కడ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తరలించారు.