గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (09:42 IST)

భారత్ - చైనా సరిహద్దుల్లో శత్రుభీకర రాఫెల్ చక్కర్లు...

భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా, తూర్పు లడఖ్ ప్రాంతంలో డ్రాగన్ సైనికులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. దీంతో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణాత్మక వైఖరి నెలకొంది. దీంతో భారత్ కూడా దూకుడు పెంచింది. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో ప్రాణనష్టం జరగడంతో ఇక డ్రాగన్‌ను ఎంతమాత్రం ఉపేక్షించరాదని భారత ప్రభుత్వం, సైన్యం నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో భారత్‌ తన అమ్ములపొదిలోని అస్త్రాలన్నింటిని సరిహద్దులకు తరలిస్తోంది. వాయుసేన కూడా తనవంతుగా గగనతల పహారా కాస్తోంది. 
 
తాజాగా ఈ పహారా కోసం భారత వాయుసేన శత్రుభీకర రాఫెల్ యుద్ధ విమానాలను మోహరించింది. అంబాలా ఎయిర్ బేస్ నుంచి లడఖ్ వరకు గగనతలంలో గస్తీ తిరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు రాఫెల్స్ ప్రయాణించాయని తెలిపారు. రాఫెల్ జెట్ ఫైటర్లు యుద్ధ రంగంలో పరిస్థితులను అనుసరించి తమ రేంజ్‌ను 780 కిలోమీటర్ల పరిధి నుంచి 1,650 కిలోమీటర్ల వరకు పెంచుకోగలవని అధికారులు వివరించారు.
 
కాగా, త్వరలోనే రాఫెల్ స్క్వాడ్రన్‌లో ఓ మహిళా పైలెట్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. అంబాలా బేస్‌లో కొలువుదీరిన రాఫెల్ విమానాలకు ఇప్పటివరకు పురుష పైలెట్లే ఉన్నారు. ఈ ఫ్రెంచ్ తయారీ యుద్ధ విహంగాలు ఇటీవల భారత వాయుసేనలో చేరాయి. అప్పటి నుంచి ఆ మహిళా పైలెట్ రాఫెల్ యుద్ధ విమానాలపై శిక్షణ పొందుతున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.