గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 నవంబరు 2020 (09:22 IST)

అన్నీ తెలిసిన ఐఏఎస్ టాపర్లు కలిసి జీవించలేక పోయారు... ఎందుకని?

వారిద్దరూ యువ ఐఏఎస్ అధికారులు. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచారు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు శిక్షణా సమయంలో ప్రేమలోపడ్డారు. ఆ తర్వాత ఓ ఇంటివారయ్యారు. ఈ తతంగమంతా 2015లోనే పూర్తయింది. కానీ, వారి ప్రేమ కేవలం ఐదేళ్ళలోనే విఫలమైంది. భార్యాభర్తలుగా కలిసి జీవించలేమని నిర్ధారించుకున్నారు. అంతే.. ఈ ఐఏఎస్ యువ జంట విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఇంతకీ ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఎవరో కాదు.. టీనా డాబీ, అథర్ అమీర్ ఖాన్.
 
ఈ రెండు పేర్లూ బాగానే గుర్తుండే ఉంటాయి. 2015 సివిల్స్ సర్వీసెస్ పరీక్షల్లో టీనా డాబీ టాపర్, అదే ఏడాది అథర్ అమీర్ ఖాన్ ఆలిండియా సెకండ్ ర్యాంక్ సాధించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టీనా సివిల్స్‌లో మొదటి ర్యాంకు సాధించిన తొలి దళిత మహిళగా రికార్డులకెక్కారు. ఇక అథర్ అమీర్ ఖాన్ జమ్మూకాశ్మీర్‍కు చెందిన‌ వారు. వీరిద్దరూ రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు. 
 
ఐఏఎస్ శిక్షణ సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, అది క్రమంగా ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. తాజాగా వీరిద్దరూ విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కారు. జైపూరులోని ఫ్యామిలీ కోర్టు-1లో విడాకుల కోసం దరఖాస్తు చేశారు. ఇద్దరం కలిసి జీవించలేమని... తమకు విడాకులు మంజూరు చేయాలని పిటిషన్‌లో కోరారు.
 
మరోవైపు టీనా డాబీ సోషల్ మీడియాలోని తన ఖాతాలో తన పేరు వెనుక పెట్టుకున్న ఖాన్‌ను తొలగించారు. అథర్ ఖాన్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి టీనాను అన్‌ఫాలో చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీగా టీనా పని చేస్తున్నారు. అథర్ అమీర్ ఈజీఎస్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు.