శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (20:14 IST)

ప్రసవం అయిన 14 రోజులకే శిశువుతో పాటు విధుల్లో చేరిన ఐఏఎస్ ఆఫీసర్..?

Soumya Pandey
ప్రసవం అయిన 14 రోజులకే విధులకు హాజరై మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఔరా అనిపించుకుంది. డెలివరీ అయిన 14 రోజులకే నవజాత శిశువుతో కార్యాలయానికి వచ్చింది.. ఆ మహిళా ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుతం ఆమె శిశువుతో విధులను నిర్వర్తించే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. విధుల పట్ల ప్రశంసనీయమైన అంకితభావంతో, ఈ జూలైలో ఘజియాబాద్ జిల్లాలో కోవిడ్‌కు నోడల్ ఆఫీసర్‌గా నియమితులైన మోదీనగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సౌమ్య పాండే గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ప్రసవించిన పక్షం రోజుల తర్వాత తిరిగి తన కార్యాలయంలో చేరారు.
 
ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. తాను ఓ  ఐఏఎస్ ఆఫీసర్ కావడంతో విధులు నిర్వర్తించడం తప్పనిసరి. కోవిడ్ -19 కారణంగా, అధికారులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాల్సిన పరిస్థితి. మహిళలకు మాతృత్వాన్ని ప్రసాదించే దేవుడు.. అందుకు తగిన శక్తిని కూడా ఇస్తాడు. గ్రామీణ భారత దేశంలో ప్రసవించిన సమీప రోజులలో మహిళలు తమ ఇంటి పనుల్లో నిమగ్నమవుతారు. అలాగే గర్భధారణలో వారి జీవనోపాధికి సంబంధించిన పనిని చేస్తారు. ప్రసవానికి అనంతరం కూడా మహిళలు బిడ్డను చూసుకుంటూ.. తమకున్న పనుల్లో మునిగిపోతారు. 
 
అదేవిధంగా, ''నా మూడు వారాల ఆడబిడ్డతో నా పరిపాలనా పనిని నేను చేయగలిగాను. ఇందుకు నా కుటుంబం మద్దతు లభించింది. గర్భధారణ సమయంలోనూ నా కుటుంబం ఇచ్చిన మద్దతుతోనే నా విధులను సక్రమంగా నిర్వర్తించగలిగాను. అలాగే జిల్లా మేజిస్ట్రేట్ సిబ్బంది కూడా నాకు మద్దతుగా నిలిచింది" అంటూ చెప్పారు. 
 
జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఘజియాబాద్‌లో కోవిడ్ కోసం నోడల్ అధికారిగా ఉన్నానని సౌమ్య తెలిపారు. సెప్టెంబరులో 22 రోజుల మెటర్నటీ లీవు తీసుకున్నానని చెప్పారు. డెలివరీ అయిన రెండు వారాల తరువాత విధుల్లో చేరానని చెప్పారు. ప్రతి గర్భిణీ మహిళ కోవిడ్-19 మహమ్మారి సమయంలో పనిచేసేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.