శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (14:21 IST)

కరోనా కష్టాల్లో కూడా ఫేస్‌టైమ్ ద్వారా వివాహం.. ఎక్కడ?

దేశంతో పాటు ప్రపంచాన్ని కరోనా వైరస్ అల్లకల్లోలం చేస్తోంది. ఈ కరోనా వైరస్ ధాటికి ప్రపంచం ఏమైపోతుందోనన్న బెంగ ఒక వైపు పట్టిపీడిస్తోంది. ప్రపంచ ఆర్థిక రంగం కుదేలైపోతోంది. అయినప్పటికీ.. వివాహాది శుభకార్యాలు మాత్రం ఆగడం లేదు. తాజా, ఇంతటి కరోనా కష్టాల్లో కూడా ఓ జంట ఒక్కటయ్యారు. వారిద్దరనీ ఫేస్‌టైమ్ అనే యాప్ కలిపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ పట్టణం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ పట్టణానికి చెందిన పెళ్లి కుమార్తె మెహజబీన్‌, పెళ్లి కుమారుడు హమీద్‌.. తమ తమ నివాసాల్లో ఉన్నారు. ఫేస్‌టైమ్‌ యాప్‌ ద్వారా మతాధికారి సమక్షంలో నిఖా వినిపించి వివాహం జరిపించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. 
 
అయితే నూతన వధూవరుల నివాసాల మధ్య దూరం 15 కిలోమీటర్లు. అయినప్పటికీ.. లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగా ఉన్న నేపథ్యంలో ఆ ఇద్దరినీ ఫేస్‌టైమ్‌ యాప్‌ ద్వారా అనుకున్న సమయానికి కలిపారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పెళ్లి కుమార్తెను తమ ఇంటికి తీసుకువచ్చి.. పెద్ద వేడుక నిర్వహించుకుంటామని వరుడు హమీద్ వెల్లడించారు.