గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (12:04 IST)

లాక్‌డౌన్ ఎఫెక్టు : ఈఎంఐలపై ఆర్నెల్లపాటు మారటోరియం విధిస్తారా?

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది. ఉత్తర కొరియా, రష్యా మినహా మిగిలిన ప్రపంచదేశాలన్నీ ఈ వైరస్ బారిపడ్డాయి. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్.. దెబ్బకు ప్రపంపం గజగజ వణికిపోతోంది. అయితే, కరోనా పుట్టిన వుహాన్ నగరంతో పాటు.. చైనా కూడా ఈ వైరస్ నుంచి బయటపడింది. కానీ, భారత్ సహా మిగిలిన ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. ఇందులో భారత్ కూడా ఉంది. ఈ నెల 24వ తేదీ అర్థరాత్రి నుంచి 21 రోజుల పాటు అంటే ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. కేవలం అత్యవసర సర్వీసులు, వైద్యసేవలు, మెడికల్, కిరణా షాపులు మినహా మిగిలిన అన్ని సర్వీసులు బంద్ అయ్యాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. చాలా కుటుంబాల్లో రెక్కాడితేగానీ, డొక్కాడని పరిస్థితి ఉంది. అలాగే, ప్రైవేటు కంపెనీల్లో పని చేసే వేతన జీవుల పరిస్థితి కూడా అంతే. అందువల్ల ప్రతి నెలనెలా కట్టాల్సిన ఈఎంఐలతో పాటు.. క్రిడిట్ కార్డు పేమెంట్స్‌పై ఆర్నెల్ల పాటు మారటోరియం విధించాలని అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పైగా, ఈ ఈఎంఐలపై భారతీయ రిజర్వు బ్యాంకుతో పాటు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ క్లారిటీ ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ మారటోరియం వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.