శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జులై 2020 (20:09 IST)

చైనాకు చురకలు : విస్తరణ వాదానికి కాలం చెల్లింది : ప్రధాని మోడీ

లడఖ్‌ ప్రాంతంలో ఆకస్మిక పర్యటన చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీ భారత సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో చైనా పేరెత్తకుండానే చురకలు అంటించారు. ముఖ్యంగా, విస్తరణవాదానికి కాలం చెల్లిందనీ, ఇది అభివృద్ధిశకం అంటూ వ్యాఖ్యానించారు. 
 
లడఖ్‌లోని నీమూలో శుక్రవారం ఆకస్మిక పర్యటన జరిపిన ప్రధాని అక్కడి ఫార్వార్డ్ పోస్ట్‌లో సైనికులను ఉద్దేశించి ఉత్తేజభరితమైన ప్రసంగం చేశారు. 'విస్తరణ వాద శకం ముగిసింది. ఇది అభివృద్ధి శకం. విస్తరణ శక్తులు మట్టికరవడమో, తోకముడవడమో జరిగినట్టు చరిత్ర చెబుతోంది' అని ప్రధాని ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
పైగా, లడక్ ప్రజలు తమ ప్రాంతాన్ని విడగొట్టేందుకు ఎవరు ఎలాంటి ప్రయత్నాలు జరిపినా తిప్పికొడుతూ వచ్చారని ప్రధాని గుర్తుచేశారు. 'దేశానికి లడక్ శిరస్సు వంటింది. 130 కోట్ల మంది భారత ప్రజలకు గర్వకారణం. దేశం కోసం అత్యున్నత త్యాగాలు చేసేందుకు సిద్ధపడే వారికే ఈ భూమి సొంతం. ఈ ప్రాంతాన్ని వేరుచేసేందుకు జరిపే ఎలాంటి ప్రయత్నాన్నైనా జాతీయభావాలు పుష్కలంగా ఉన్న లడక్ ప్రజలు తిప్పికొడతారు' అంటూ మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 
 
ఆ తర్వాత గల్వాన్ ఘటనలో గాయపడిన జవాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరామర్శించారు. నాటి ఘటన గురించి నేరుగా సైనికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జవాన్ల భుజం తట్టి వారి ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. 
 
లడఖ్‌ గల్వాన్ లోయలో జూన్ 15న బలగాల ఉపసంహరణ సమయంలో చైనా బలగాలు కుట్రపూరితంగా వ్యవహరించి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లను పొట్టనపెట్టుకుంది. ఈ ఘటనలో చైనా సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోయినా డ్రాగన్ కంట్రీ మాత్రం ఇప్పటివరకు నోరు మెదపడం లేదు. 
 
45 మంది దాకా చనిపోయారని కథనాలు వచ్చినా చైనా స్పష్టం చేయలేదు. గల్వాన్ ఘటన తర్వాత భారత్ - చైనా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. వాస్తవాధీన రేఖ వెంబడి వేలాది మంది సైనికులను రెండు దేశాలూ మోహరించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా లడఖ్ పర్యటన చేపట్టారు.