1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (17:31 IST)

అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్ - ఇద్దరు మృతి

helicopter crash
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాదకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. భారత సైన్యానికి చెందిన చెందిన ఓ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మృతి చెందినట్టు భావిస్తున్నారు. రాష్ట్రంలోని మండలా పర్వత ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రోజువారీ విధుల్లో భాగంగా ఇక్కడి సెంగే గ్రామం నుంచి మిసామారీకి వెళ్తుండగా.. మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లు సైన్యం వెల్లడించింది. 
 
ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్లు(లెఫ్టినెంట్ కర్నల్, మేజర్) ఉన్నారని తెలిపింది. ఇద్దరూ గల్లంతయ్యారని, వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొంది. అయితే, వీరిద్దరూ మృతి చెందివుంటారని భావిస్తున్నారు. 
 
ఈ ఘటనపై ఆర్మీ అధికారులు స్పందిస్తూ, "అరుణాచల్‌లోని బోమ్‌డిలా సమీపంలో గురువారం ఉదయం 9.15 గంటలకు ఆర్మీ చెందిన చీతా హెలికాప్టర్‌కు ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్‌‌తో సంబంధాలు తెగిపోయాయి అని సైన్యం తెలిపింది. 
 
బోమ్‌డిలాకు పశ్చిమాన ఉన్న మండలా ప్రాంతంలో ఇది కూలిపోయినట్లు వెల్లడించింది. మరోవైపు.. స్థానికంగా వాతావరణం పొగమంచుతో కూడుకునివుండంతో 5 మీటర్ల పరిధి వరకే కనిపిస్తోందని స్థానిక పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు ప్రారంభించామని, హెలికాప్టర్‌లోని ఇద్దరు పైలట్ల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు.