1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 జూన్ 2023 (14:50 IST)

ల్యాండ్ అవుతుండగా భూమికి తగిలిన విమానం తోకభాగం.. తప్పిన పెనుముప్పు

indigo
దేశ రాజధాని ఢిల్లీలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈ విమానం ల్యాండ్ అవుతుండగా దాని తోకభాగం నేలకు తగిలింది. అయితే, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. పైలెట్ల అప్రమత్తతో అది సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనతో విమానం దెబ్బతినడంతో దాని సర్వీసులను నిలిపివేశారు. 
 
ఈ ఘటన రెండు రోజుల క్రితం జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్‌ 11న కోల్‌కతా నుంచి వచ్చిన ఇండిగో వీటీ-ఐఎంజీ విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుండగా.. తోక భాగం రన్‌వే నేలను తాకింది. అయితే, విమానం సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై డీజీసీఏ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
 
"విమానం ల్యాండ్‌ అయ్యేంతవరకు ఏ సమస్యా తలెత్తలేదు. రన్‌వేను సమీపిస్తుండగా.. సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా విమానం కదులుతున్నట్లు పైలట్లు గుర్తించారు. అలాగే ల్యాండింగ్‌ ప్రక్రియను ఆరంభించారు. అయితే విమానం దిగే సమయంలో దాని తోకభాగం రన్‌వే నేలను తాకింది" అని డీజీసీఏ వెల్లడించింది.
 
ఈ ఘటన కారణంగా విమానం వెనుకభాగం దెబ్బతింది. దీంతో దాని సేవలను నిలిపివేసినట్లు ఇండిగో వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. అప్పటిదాకా విమానం నడిపిన పైలట్లను కూడా విధుల నుంచి పక్కనబెట్టినట్లు పేర్కొంది.