1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

నిద్రమత్తును వీడని విక్రమ్ ల్యాండర్ - ప్రజ్ఞాన్ రోవర్

Chandrayaan 3
చంద్రమండలం దక్షిణ ధృవం అధ్యయనం కోసం వెళ్లిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు నిద్రాణ స్థితిలోనే ఉన్నాయి. చంద్రుడిపై పొద్దుపొడిచి మూడు రోజులు అయినప్పటికీ ల్యాండర్, రోవర్‌ల నుంచి ఎలాంటి సిగ్నల్స్ రావడం లేదు. అయితే, వీటిని నిద్రలేపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. అయినప్పటికీ విశ్రమించేది లేదనీ.. అక్కడ వెలుతురు ఉన్నంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటామని ఇస్రో తెలిపింది. పైగా, అవి ఎపుడైనా నిద్ర మేల్కొనవచ్చన ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరుగుతుందో చెప్పడం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, చంద్రుడిపై పొద్దుపొడిచి మూడు రోజులు దాటినా చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదని, అయితే, సూర్యరశ్మి ల్యాండర్, రోవర్‌పై ఉన్నంతకాలం అవి ఎప్పుడైనా మళ్లీ క్రియాశీలకం కావచ్చని తెలిపారు.
 
'ఇప్పటివరకూ ఎటువంటి సిగ్నల్ రాలేదు. అలా అని సిగ్నల్ ఇక ఎప్పటికీ రాదని కూడా చెప్పలేం. మరో 14 రోజుల పాటు వేచి చూద్దాం. ఈ సమయంలో ల్యాండర్, రోవర్‌రై సూర్యరశ్మి పడుతూనే ఉంటుంది. కాబట్టి, వాటి ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. అంటే చివరి రోజున కూడా అవి క్రియాశీలకం కావచ్చు. తదుపరి ఏం జరుగుందో చెప్పడం అసాధ్యం' అని ఆయన పేర్కొన్నారు.
 
చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ మరోసారి క్రియాశీలకం అయితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఇస్రో చీఫ్ తెలిపారు. మునుపు జరిపిన పరీక్షలను మరో ప్రాంతంలో నిర్వహించి చంద్రుడి గురించి మరింత ఖచ్చితమైన సమాచారం సేకరించవచ్చని అన్నారు. అయితే, ల్యాండర్, రోవర్ మళ్లీ మేల్కొంటాయా? లేదా? అన్న విషయం అటుంచితే చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో పేర్కొంది.