1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (20:43 IST)

ఫోన్‌ లాక్కుంటారా? చుక్కలు చూపించిన 17 ఏళ్ల బాలిక.. బేటీ బచావొ, బేటీ పడావోకు..?

Jalandhar girl
లాక్ డౌన్ వేళ నేరాలు పెరిగిపోతున్నాయి. మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ క్రమంలో ఫోన్‌ను కొట్టేసి, పారిపోయేందుకు యత్నించిన ఇద్దరు దుండగులకు 17 ఏళ్ల బాలిక చుక్కలు చూపించింది. రాడ్‌తో దాడి చేస్తున్నప్పటికీ... వీరోచితంగా పోరాడి దుండగులకు పోలీసులకు అప్పగించింది. ఆ బాలిక ధైర్యసాహసాలకు గుర్తింపుగా డిసి ఘన్‌శ్యామ్‌ థోరి రూ. 51 వేల నగదు బహుమతిని ప్రకటించారు. 
 
అంతేకాదు... ''బేటీ బచావొ, బేటీ పడావో'' కార్యక్రమానికి ప్రచార కర్తగా నియమించాలని జలంధర్‌ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి సాహస పురస్కారాలకు ఆమె పేరును సిఫారసు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన పంజాబ్‌లోని జలంధర్‌కు సమీపంలోని కపుర్తలా రోడ్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... హోమ్‌ ట్యూషన్‌ నుండి తిరిగి ఇంటికి వెళుతున్న కుసుమకుమారి అనే బాలిక నుంచి ఫోన్‌ను లాక్కునేందుకు బైక్‌పైవచ్చిన ఇద్దరు దుండగులు యత్నించారు. అయితే ఆ బాలిక... దుండగుడిని బైక్‌ ఎక్కకుండా అడ్డుకుంది. దీంతో దుండగుడు ఇనుప రాడ్‌తో బాలిక మణికట్టుపై దాడి చేశాడు. రాడ్‌తో దాడి చేస్తున్నప్పటికీ.. అతనిని బండి ఎక్కకుండా లాగి కింద పడేసింది.
 
అదే క్రమంలో... మరి కొందరు స్థానికుల సాయంతో దుండగుడిని పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాను దుండగులను చూసి భయపడలేదని, మూడు నెలల నుండి తైక్వాండోలో శిక్షణ పొందుతున్నానని ఆ బాలిక తెలిపింది. కాగా... కుసుమ కుమారి తండ్రి కార్మికుడి గాను, తల్లి గృహిణిగాను జీవనం సాగిస్తున్నారు. దుండగుడిని అవినాష్‌ కుమార్ ‌(22) గా గుర్తించారు. మరో నిందితుని కోసం గాలిస్తున్నారు.