ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (09:01 IST)

బారాముల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో నంద్యాల జవాను వీరమరణం

surendra
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మరోమారు ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఇక్కడ ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ యువ జవాను వీరమరణం చెందారు. ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య కాల్పులు జరగ్గా, ఈ కాల్పుల్లో నంద్యాల జిల్లాకు చెందిన యువ జవాను వీరమరణం చెందాడు. 
 
జిల్లాలోని పాములపాడు మండలం మద్దూరు పంచాయతీకి చెందిన సురేంద్ర(24) 2019లో సైన్యంలో చేరారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు మంగళవారం సమాచారం అందింది. 
 
మూడు రోజుల క్రితమే తమతో ఫోనులో మాట్లాడిన కుమారుడు శాశ్వతంగా దూరమయ్యాడని తెలిసి తల్లిదండ్రులు సుబ్బమ్మ, సుబ్బయ్య తల్లడిల్లిపోతున్నారు. వారిని ఓదార్చడం ఎవరితరం కావడంలేదు.
 
సెప్టెంబరు నెలలో ఇంటికి వస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సురేంద్ర పార్థివదేహం బుధవారం ఉదయానికి స్వగ్రామం చేరే అవకాశం ఉంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.