గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2020 (11:39 IST)

దిగివచ్చిన డోనాల్డ్ ట్రంప్ - బైడెన్‌కు అధికార పగ్గాల బదిలీకి ఓకే!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు దిగివచ్చాడు. యూఎస్ అధ్యక్ష పీఠానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. ట్రంప్‌పై డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయభేరీ మోగించారు. అయితే, అమెరికా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ, అధికార బదిలీకి ససేమిరా అన్నారు. కానీ, ఇపుడు మెట్టు దిగారు. అధికార పగ్గాలను బైడెన్‌కు బదలాయించేందుకు సిద్ధమయ్యారు. దీనికి కారణం.. అమెరికా కోర్టుల్లో ట్రంప్ వేస్తున్న కేసులు తిరస్కరణకు గురికావడమే. 
 
బైడెన్‌కు పాలనాధికారాలు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు శ్వేత శౌధం, జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బైడెన్ గెలుపును అంగీకరించినట్టు ట్రంప్ విస్పష్ట ప్రకటన ఏదీ చేయనప్పటికీ.. అధికార బదిలీ ప్రక్రియను అనుమతించిడం గమానార్హం. అయితే... తన పోరాటం ఆగదని, అంతిమ విజయం తనదేనని యధావిధిగా తనదైన శైలిలో ట్రంప్ సోమవారం వరుస ట్వీట్లు చేశారు. 
 
అధికార బదిలీకి ట్రంప్ అంగీకారం తెలుపేందుకు మునుపు ప్రభుత్వంలో అనేక కీలక ఘట్టాలు చోటుచేసుకున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సాధించిన జో బైడెన్‌కు అధికార బదిలీకి సంబంధించి కీలక పత్రాలను పరిశీలించేందుకు జనరల్ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్ ఎమిలీ మర్ఫీ నిరాకరించారు. దీనిపై దుమారం చెలరేగడంతో ఎమిలీ వెనక్కి తగ్గారు. ఈ క్రమంలోనే సోమవారం బైడెన్‌కు ఎమిలీ లేఖ రాశారు. అనుమతి నిరాకరించడమనేది తనంతట తానుగా తీసుకున్న నిర్ణయమని, ఎవరి ఒత్తడీ లేదని ఆమె లేఖలో పేర్కొన్నారు.
 
కాగా.. ఎమిలీ ప్రకటనతో బైడెన్‌ శ్వేతశౌధంలో అడుగు పెట్టడం ఇక లాంఛనమేనని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బైడెన్, కమలా హారిస్ విజయం సాధించారని జీఎస్ఏ దాదాపు అంగీకరించినట్టేనని బైడెన్ తరఫున అధికార బదిలీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న యోహాన్నెస్ అబ్రహామ్ ఓ ప్రకటన విదుడల చేశారు. అమెరికా ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారానికి ఇది తొలి అడుగు అని, కరోనా కట్టడితో పాటు అర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని వ్యాఖ్యానించారు.