గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 19 జులై 2019 (09:11 IST)

అటో - ఇటో తేలిపోనున్న 'కుమార' గండం - గవర్నర్ డెడ్‌లైన్!

కర్నాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఫలితంగా గురువారం జరగాల్సిన విశ్వాసపరీక్ష కాస్త శుక్రవారానికి వాయిదాపడింది. శుక్రవారం కూడా సజావుగా సాగుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థంగా మారింది. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా శాసనసభ స్పీకర్ రమేష్ కుమార్‌కు డెడ్‌లైన్ విధించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలలోపు అటో ఇటో తేల్చాలంటూ హుకుం జారీచేశారు. 
 
నిజానికి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునేందుకు ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి ముందుకువచ్చారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ప్రత్యేకంగా సమావేశపరిచారు. అనంతరం గురువారం సమావేశంకాగా, ముఖ్యమంత్రి కుమార స్వామి విశ్వాసపరీక్షా తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు.
 
అయితే, సభలో గందరగోళం ఏర్పడటంతో సభను స్పీకర్ నేటికి వాయిదావేశారు. ఫలితంగా కుమారస్వామి ప్రభుత్వం గురువారం విశ్వాస గండం నుంచి బయటపడింది. బలపరీక్షపై ఎటూ తేల్చకుండానే స్పీకర్ రమేష్ కుమార్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. స్పీకర్ తీరుకు నిరసనగా బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. బలపరీక్షపై స్పీకర్ కావాలనే జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మరోవైపు రెబెల్స్‌ను బుజ్జగించడానికి కాంగ్రెస్ నేతలు తుది ప్రయత్నాలు చేస్తున్నారు. ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేత సిద్ధరామయ్యకు టచ్‌లోకి వచ్చారు. మరో వారం రోజుల వరకు సంక్షోభాన్ని పొడిగించాలన్న ఆలోచన కాంగ్రెస్ నేతలకు ఉంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలలోగా బలనిరూపణ పూర్తి కావాలని ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నర్ లేఖ రాశారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం కుమారస్వామి బలపరీక్ష ఎదుర్కోనున్నారు.