ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2024 (12:53 IST)

విజయవంతంగా తేజస్ ఎంకే1ఏ వెర్షన్ గగన విహారం

tejas
భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన యుద్ధ విమానం తేజస్. దీన్ని మరింత ఆధునికీకరించి తేజస్-ఎంకే 1ఏ వెర్షన్‌కు రూపకల్పన చేశారు. ఇప్పుడీ సరికొత్త పోరాట విమానం తొలిసారిగా పూర్తిస్థాయిలో విజయవంతంగా గగన విహారం చేసింది. ఇప్పటికే ఈ తేలికపాటి యుద్ధ విమానం భారత వాయుసేన అమ్ములపొదిలో చేరింది. 
 
గురువారం బెంగళూరులో అన్ని హంగులతో, సకల అస్త్రశస్త్రాలను అమర్చుకుని సంతృప్తికరంగా గగన విహారం చేసింది. భారత రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో అనుబంధ సంస్థ ఏరోనాటికల్ డెవలప్‌‌మెంట్ ఏజెన్సీ ఈ ఫైటర్ జెట్‌ను డిజైన్ చేసింది. తేజస్ ఎంకే 1ఏ యుద్ధ విమానాలను ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేస్తోంది.
 
గత కొన్నేళ్లుగా అనేక పర్యాయాలు తేజస్ యుద్ధ విమానాలకు ట్రయల్స్ నిర్వహించారు. గురువారం నాటి గగన విహారం 18 నిమిషాల పాటు సాగింది. రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కేకే వేణుగోపాల్ ఈ విమానాన్ని నడిపారు. త్వరలోనే ఈ విమానాలను వాణిజ్య ప్రాతిపదికన సరఫరా చేసే అవకాశాలున్నాయి.