బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 మే 2023 (17:44 IST)

ఢిల్లీలో 16 యేళ్ల బాలిక దారుణ హత్య.. చలించిపోయిన సీఎం కేజ్రీవాల్

arvind kejriwal
దేశ రాజధానిలో తాజాగా జరిగిన బాలిక హత్యోదంతం తీవ్ర కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే 16 యేళ్ల బాలికను ఓ యువకుడు అనేకసార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ వీడియో ఫుటేజీలను చూసిన ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తోపాటు ఇతర ప్రముఖులు కూడా స్పందించారు. ఈ ఘటనపై కఠినంగా వ్యవహరించాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు సీఎం కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ నగరంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఎల్జీదేనని స్పష్టం చేశారు. 
 
'ఢిల్లీలో ఓ 16ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. ఇది చాలా దురదృష్టకరం. నేరస్థులకు భయం లేకుండా పోయింది. పోలీసులంటే వారికి భయం లేదు. ఎల్జీ సర్‌, శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత మీదే. ఏదైనా చేయండి. ఢిల్లీ పౌరుల భద్రతే గవర్నర్‌ తొలి ప్రాధాన్యం కావాలి' అని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు.
 
మరోవైపు, ఢిల్లీ మంత్రి అతిషీ కూడా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తీరుపై మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలను రక్షించే బాధ్యత రాజ్యాంగం కల్పించిందని లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు గుర్తు చేస్తున్నాను. కానీ, ఆయన సమయం మొత్తం కేజ్రీవాల్‌ పనులను ఆటంకపరిచేందుకే కేటాయిస్తారు. ఢిల్లీ మహిళలకు రక్షణ కల్పించడంపై శద్ధ చూపాలని చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా అని ఆమె ట్వీట్‌ చేశారు.