మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (16:03 IST)

ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు కష్టాలు చెప్పతరమా? ఎక్కడ?

దేశంలో అమలవుతున్న లాక్‌డౌన్ చాలామందిని కష్టాల్లోకి నెట్టింది. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోని కాలు బయటపెట్టడానికి వీల్లేకపోవడంతో ముఖ్యంగా, ప్రేమికులు, ఇద్దరు, ముగ్గురు భార్య ముద్దుల మొగుళ్లు, వివాహేతర సంబంధం కొనసాగించే మహిళలు, పురుషుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 
 
అలాగే, అనేక మంది పురుషుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వంట పని నుంచి మొదలుకుంటే అన్ని పనులను భార్యలు భర్తలచే చేయిస్తున్నారని జోకులు పేలుతున్నాయి. తమకు కూడా కష్టకాలం వచ్చిందని భర్తలు చిరాకు పడుతూ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తున్నారు. కానీ నిజంగానే ఓ భర్తకు కష్టకాలం వచ్చింది. ఎందుకంటే ఆయనకు ఇద్దరు భార్యలు. వారి కాపురాలు వేర్వేరు. దీంతో ఏ భార్యకు న్యాయం చేయాలో అర్థం కాని పరిస్థితి ఆ భర్తది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగళూరుకు చెందిన 40 యేళ్ల రాజేష్ అనే ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు. ఒకరు సుధ (35), మరొకరలు నిధి. సుధాతో రాజేష్‌కు 10యేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ బిడ్డకూడా ఉన్నాడు. రాజేష్ బట్టల వ్యాపారి కావడంతో ఆయనకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిపై భర్తను సుధ నిలదీయగా.. అది వివాహేతర సంబంధం కాదు.. తన రెండో భార్య అని చెప్పాడు. దీంతో కోపంతో ఊగిపోయిన సుధా పోలీసులను ఆశ్రయించింది. 
 
మొత్తానికి సుధాతో కేసును ఉపసంహరింపజేసి.. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఇద్దరిని సమానంగా చూసుకుంటానని, ఎవరికీ ఏ లోటు రానివ్వనని, ఇద్దరికి వారం రోజుల చొప్పున సమయం కేటాయిస్తానని పెద్దల సమక్షంలో ఉమేష్‌ అంగీకరించాడు. ఈ ఒప్పందం ప్రకారమే రాజేష్ ఇంతకాలం నడుచుకుంటూ వచ్చాడు. 
 
అలా సాగిపోతున్న రాజేష్ సంసారంలో లాక్‌డౌన్ కష్టాలు తెచ్చిపెట్టింది. మార్చి 21న నిధి నివాసానికి రాజేష్ వెళ్లాడు. మార్చి 28న సుధా నివాసానికి ఆయన రావాలి. కానీ లాక్‌డౌన్‌ కారణంగా సుధా వద్దకు వెళ్లలేకపోయాడు. ఎలాగైనా ఇంటికి రావాలని ఫోన్‌ ద్వారా భర్తను సుధా కోరింది. 
 
కానీ పోలీసుల చర్యల వల్ల సుధా ఇంటికి రాజేష్ రాలేకపోయాడు. దీంతో భర్తను తన వద్దకు తీసుకురావాలని సుధా పోలీసు హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు కాల్‌ చేసి విజ్ఞప్తి చేసింది. ఇంట్లో నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు లేవని, తన భర్తను తన ఇంటికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సుధా పోలీసులను కోరింది. దీనిపై పోలీసులు ఎలా స్పందించాలో తెలియక జుట్టుపీక్కుంటున్నారు.