శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 10 మార్చి 2019 (17:31 IST)

17వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్... అమల్లోకి వచ్చిన కోడ్.. ఓటర్లు ఎంతమంది?

దేశంలో 17వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరా సారథ్యంలోని భారత ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్‌ను ఆదివారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేసింది. ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి జూన్ 3వ తేదీతో ముగియనుంది. దీంతో 17వ లోక్‌సభ ఎన్నిక కోసం సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు. 
 
మొత్తం 543 లోక్‌సభ స్థానాలతో పాటు 4 నాలుగు అసెంబ్లీ రాష్ట్రాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ (175 సీట్లు), ఒడిషా (147 సీట్లు), సిక్కిం (32 సీట్లు), అరుణాచల్ ప్రదేశ్ (60 సీట్లు) రాష్ట్రాలు ఉన్నాయి. 
 
ఈ ఎన్నికల నిర్వహణ కోసం భారీగా కసరత్తు చేసినట్టు సీఈసీ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల ప్రధానాధికారులతో చర్చించామన్నారు. ముఖ్యంగా, సెలవు దినాలు, పండగల తేదీలను పరిగణనలోకి తీసుకుని ఈ షెడ్యూల్‌ను తయారు చేసినట్టు వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఆదివారం నుంచే అమల్లోకి వస్తుందన్నారు. 
 
ప్రస్తుతం దేశంలో 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు చెప్పారు. కొత్తగా 8.4 కోట్ల మంది ఓటర్లుగా తమ పేర్లను నమోద చేసుకున్నట్టు చెప్పారు. అలాగే, ఓటు హక్కును కలిగిన వారిలో 99.36 శాతం మందికి ఓటరు గుర్తింపు కార్డును మంజూరు చేసినట్టు తెలిపారు. ఒకవేళ ఓటరు గుర్తింపు కార్డు లేనివారు 12 రకాల గుర్తింపు కార్డులను చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. 
 
దేశవ్యాప్తంగా 10 లక్షల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. గత ఎన్నికల కంటే లక్ష పోలింగ్ కేంద్రాలు అదనంగా ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌కు ఐదు రోజులకు ముందుగా ఓటరు స్లిప్‌లు ఇస్తామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీ ప్యాట్లు ఉంచుతామన్నారు. ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలు కూడా ఉంటాయన్నారు. ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.