శనివారం, 5 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2023 (14:52 IST)

లోక్‌సభలో భద్రతా వైఫల్యం... సభలోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు

lok sabha attack
పార్లమెంట్ సమావేశాల వేళ లోక్‌సభ‌లోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో లోక్‌సభలో దుండగులు కలకలం సృష్టించారు. సందర్శకులు కూర్చునే గ్యాలరీ నుంచి ఓ వ్యక్తి సభలోకి దూకగా.. మరో వ్యక్తి గ్యాలరీ వద్ద ఒకరకమైన గ్యాస్‌ను వదిలి భయభ్రాంతులకు గురిచేశాడు. అదే సమయంలో పార్లమెంట్‌ భవనం వెలుపల మరో ఇద్దరు రంగుల పొగలు వదిలారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఈ నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. 
 
దీనిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని, దానికి పూర్తి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించాలని పట్టుబట్టారు.
 
"లోక్‌సభ లోపల ఇద్దరు దుండగులు, బయట మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నాం. వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతాం. ఆ పూర్తి బాధ్యత నాదే. నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 
 
అయితే, నిందితులు వదిలిన గ్యాస్‌ ఏమిటనే దానిపై సమగ్ర విచారణ జరుపుతాం. దీనిపై ఈ సాయంత్రం సమావేశం నిర్వహిస్తాం. సభ్యుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటాం" అని వెల్లడించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే.. సభ సజావుగా నిర్వహించడం మనందరి బాధ్యత అని స్పీకర్‌ అన్నారు.