బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (09:40 IST)

కరెంట్ బిల్లు కట్టమన్నారనీ రూమ్మేట్స్‌ను చంపేసిన యువకుడు...

ఢిల్లీలో ఉపాధి చేసుకుంటూ జీవిస్తూ వచ్చిన ఓ యువకుడు కరోనా లాక్డౌన్ కారణంగా సొంతూరికి వెళ్లిపోయాడు. నాలుగు నెలల తర్వాత మళ్లీ ఢిల్లీలోని తన రూమ్మేట్స్ గదికి వచ్చాడు. అతను వచ్చీరాగానే, మిగిలిన ఇద్దరు స్నేహితులు కరెంట్ బిల్లు, అద్దె కట్టమని ఒత్తిడి చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహించిన ఆ యువకుడు... ఇద్దరు రూమ్మేట్స్‌ను పొడిచి చంపేసి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. ఈ ఘటన వెస్ట్ న్యూఢిల్లీలోని రఘుబీర్ నగర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహ్ గ్రామానికి చెందిన సాకీర్ (23) అనే వ్యక్తి వెస్ట్ ఢిల్లీలోని రఘుబీర్ నగర్‌లో మరో ఇద్దరు వలస కూలీలైన అజాం(45), అమీర్ హాసన్ (46)తో కలిసి ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఈ గదికి నెలకు రూ.4 వేలు అద్దె చెల్లిస్తూ వచ్చారు. 
 
అయితే, లాక్డౌన్‌ కారణంగా సాకీర్ తన స్వగ్రామానికి వెళ్లి, నాలుగు నెలల తర్వాత మంగళవారం రూమ్‌లో దిగాడు. దీంతో మిగిలిన ఇద్దరు రూమ్మేట్స్ ఆగ్రహించారు. అతను లేని నాలుగు నెలల అద్దె కూడా కట్టాలని పట్టుబట్టారు. దీంతో కొపం తెచ్చుకున్న నిందితుడు మిత్రులిద్దర్నీ పొడిచి చంపేసి, స్వగ్రామానికి వెళ్లిపోయాడు. 
 
దీనిపై ఇరుగుపొరుగువారు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ తర్వాత నిందితుడిని అరెస్టుచేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, సాకీర్ సొంత గ్రామానికెళ్లి అరెస్టు చేశారు.