1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (09:46 IST)

సమోసాల ఆశచూపి... ఆరేళ్ళ బాలికపై తాత - మేనమామ అత్యాచారం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో దారుణం జరిగింది. ఆరేళ్ళ పసిపాపపై తాతతో పాటు మేనమామ కూడా లైంగికదాడికి పాల్పడ్డారు. అదీకూడా మూడేళ్ళ తమ్ముడి ఎదుటే అత్యాచారానికి గురైంది. భోపాల్‌లోని కోలార్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. 
 
భోపాల్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎనిమిది రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రాణాలతో బయటపడిన ఆమె తన తల్లికి గత చాలా రోజులుగా అనుభవిస్తున్న బాధ గురించి చెప్పింది. 
 
సమోసాలు ఇస్తానంటూ బాలిక మేనమామ బాలికను, ఆమె మూడేళ్ల తమ్ముడిని బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే ఆమె తాత వచ్చిఉన్నాడు. వారిద్దరూ కలిసి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. మూడేళ్ల చిన్నారి(బాధితురాలి సోదరుడు) కళ్లముందే వారీ ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు చెప్పారు.
 
ఆరేళ్ల బాలిక రక్తస్రావం కావడంతో వారు వెంటనే గ్రహించి బాధితురాలికి, తన తమ్ముడికి సమోసా, రూ.20 ఇచ్చి విడిచిపెట్టారు. అలాగే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి పంపారు. బాధితురాలు తన తల్లిదండ్రులకు ఈ విషయం గురుంచి చెప్పడానికి చాలా భయపడి, నిశ్శబ్దంగా ఉండిపోయారు. 
 
అయితే, బాలిక ప్రవర్తనలో మార్పులను గమనించిన బాధితురాలి తల్లి ఏమి జరిగిందో గట్టిగ అడిగేసరికి జరిగినదంతా ఆమెకు చెప్పింది. షాకైన తల్లి తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు ఇద్దరూ కూలీలు, మద్యానికి బానిసలు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.