1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (13:27 IST)

కరోనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం ... 10 మంది మృత్యువాత

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ మాల్‌లో సన్‌రైజ్ కరోనా ఆస్పత్రిలో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో చనిపోయినవారి సంఖ్య 10కి చేరింది. ముంబై మహా నగరంలోని భాండప్‌ ప్రాంతంలో ఓ మాల్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇదే మాల్‌లోని ఓ అంతస్తులో కరోనా ఆస్పత్రి కూడా ఉంది. ఇందులో 70 మందికిపైగా కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. 
 
గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత స్థానిక డ్రీమ్స్‌ మాల్‌లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మూడో అంతస్తులో ఉన్న సన్‌రైజ్‌ హాస్పిటల్‌ వరకు మంటలు వ్యాపించాయి. ఈ ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. 
 
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. అయితే తమ ఆస్పత్రిలో ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కొవిడ్‌తో చనిపోయిన ఇద్దరి మృతదేహాలను అగ్నిప్రమాదం తర్వాత బయటకు తీసుకొచ్చినట్లు సర్‌రైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. 
 
‘‘ఫైర్‌ అలారం మోగడంతో మేం అప్రమత్తమై 76 మంది రోగులకు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాం. కరోనాతో చనిపోయిన ఇద్దరి మృతదేహాలను తీసుకొచ్చాం’’ అని తెలిపాయి. కాగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
 
ఘటనాస్థలాన్ని ముంబై కిషోరీ మేయర్‌ పరిశీలించారు. మాల్‌లో ఆస్పత్రిలో ఉండటం పట్ల మేయర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే తాము నిబంధనల ప్రకారమే ఇక్కడ ఆస్పత్రి ఏర్పాటు చేశామని సన్‌రైజ్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపింది. మాల్‌లో ఆస్పత్రి నడిపేందుకు ఎలా అనుమతి ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.