శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (17:13 IST)

లిఫ్ట్‌ గ్రిల్స్‌కు, డోర్‌కు మధ్యలో వుండిపోయిన బాలుడు.. వీడియో వైరల్.. నెటిజన్ల ఫైర్

మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని ధారవి ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. లిఫ్ట్‌ గ్రిల్స్‌కు డోర్‌కు మధ్యలో వుండిపోయిన ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ  ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. ఈ వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చూసిన జనమంతా ఆ బాలుడిని చూస్తూ అయ్యో పాపం అంటున్నారు. 
 
పిల్లలను ఇలా లిఫ్ట్ వద్ద వదలిపెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించిన తల్లిదండ్రులను ఏకిపారేస్తున్నారు. లిఫ్ట్ డోర్, గ్రిల్స్ కలిగివున్న చోట ఇలా పిల్లల్ని వదిలి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. చివరికి స్నేహితుల‌తో ఆడుకుంటున్న‌ ఐదేండ్ల బాలుడు లిఫ్టులో ఇరుక్కుని మృతిచెందడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
వివ‌రాల్లోకి వెళ్తే.. ధారావి షాహుర్‌ నగర్‌లోని కోజీ షెల్టర్‌ అనే అపార్ట్‌మెంట్‌లో ఉండే మహ్మద్‌ హోజైఫ్‌ షేక్‌ అనే ఐదేండ్ల‌ బాలుడు స్నేహితులతో కలిసి ఆడుకుంటూ.. కింది ఫ్లోర్‌కు వెళ్లడం కోసం ఫోర్త్ ఫ్లోర్‌లో లిఫ్ట్‌ ఎక్కాడు. అయితే లిఫ్ట్‌ కింది ఫ్లోర్‌ రాగానే డోరు తెరుచుకుంది. 
 
దాంతో మ‌హ్మ‌ద్ హూజైఫ్ షేక్‌ త‌ప్ప అత‌ని స్నేహితులు అంద‌రూ లిఫ్టు నుంచి బయటికి వెళ్లిపోయారు. చివ‌ర‌గా లిఫ్టు నుంచి బ‌య‌టికి వ‌చ్చిన షేక్‌.. గ్రిల్స్‌ వేస్తుండగా వెనుక ఉన్న డోర్‌ మూసుకుపోయింది. దాంతో షేక్ డోర్‌కు, గ్రిల్స్‌కు మధ్య ఉండిపోయాడు. ఇంత‌లో మ‌రొక‌రు లిఫ్ట్ బ‌ట‌న్ నొక్క‌డంతో లిఫ్ట్‌ క‌దిలింది. దాంతో బాలుడు గ్రిల్స్ మ‌ధ్య న‌లిగి ప్రాణాలు కోల్పోయాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.