1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (17:14 IST)

ప్లాట్‌ఫాంపై దిగగానే మహిళ బుగ్గపై ముద్దు... ఏడాది జైలు, రూ.10వేల జరిమానా

మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్న తరుణంలో.. ఓ మహిళ బుగ్గపై ముద్దు పెట్టినందుకు నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ముంబై మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనపై తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. 2015, ఆగస్టు 26న బాధిత మహిళ తన స్నేహిడితో కలిసి గోవాండి నుంచి లోకల్ ట్రైన్‌లో సీఎస్‌ఎంటీ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ప్లాట్‌ఫాంపై దిగగానే కిరణ్ హోనోవర్(37) ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. బలవంతంగా తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని బాధితురాలు పేర్కొంది.
 
ఈ ఘటన అనంతరం బాధితురాలు సీఎస్‌ఎంటీ రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు నిందితుడిపై సెక్షన్ 354, 354 (ఎ) (1) కింద కేసు నమోదు చేశారు. దాదాపు ఏడేళ్లుగా ఈ కేసు కోర్టులో ఉంది. సంబంధిత సాక్షులందరినీ విచారించిన అనంతరం ఫోర్ట్ కోర్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వీఎస్పీ కేదార్ నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష పదివేల రూపాయల జరిమానా విధించారు.