శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2019 (16:06 IST)

నిర్మలా సీతారామన్‌ నాకు స్నేహితురాలు : నోబెల్ పురస్కార గ్రహీత

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తనకు స్నేహితురాలని నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్నారు. ఆయన తాజాగా మాట్లాడుతూ, ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో (జేఎన్‌యూ) తాము కలిసి చదువుకున్నామని గుర్తు చేశారు. 
 
1983లో అభిజిత్‌ జేఎన్‌యూలో ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్‌ పూర్తిచేయగా, నిర్మలాసీతారామన్‌ కూడా ఎకనమిక్స్‌లో మాస్టర్స్‌తోపాటు 1984లో ఎంఫిల్‌ పూర్తిచేశారు. దేశం గురించి జేఎన్‌యూలో తాను ఎంతో నేర్చుకున్నానని అభిజిత్‌ తెలిపారు. 
 
నిర్మల తనకు స్నేహితురాలని, ఆమె చాలా తెలివైనవారన్నారు. అప్పట్లో తమ రాజకీయ భావనలు కూడా నాటకీయంగా భిన్నంగా ఉండేవి కాదన్నారు. బీజేపీ ప్రభుత్వం పట్ల తాను విమర్శలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. 'గతంలో నేను చేసిన వ్యాఖ్యలను వారు పరిశీలించాలి. యూపీఏ పాలనపైనా నేను తీవ్ర విమర్శలు చేశాను' అని గుర్తుచేశారు. 
 
కాగా, పేదరిక నిర్మూలనకు విశిష్ట పరిశోధనలు జరిపిన అభిజిత్‌కు ఈ యేడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. అభిజిత్‌తోపాటు ఆయన భార్య డ్యుఫ్లో, మైఖెల్‌ క్రేమర్‌ కూడా నోబెల్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం వీరంతా అమెరికాలో నివసిస్తున్నారు.