1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (11:12 IST)

నితీశ్‌కుమార్‌ మంత్రివర్గ విస్తరణ.. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం

బీహార్‌లో సీఎం నితీశ్‌కుమార్‌ మంగళవారం తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. రాజ్‌భవన్‌లో కొత్తమంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి రాజ్‌భవన్‌లో సన్నాహాలు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంత్రులతో మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు తెలిసింది. 
 
ఇకపోతే సీఎంకు సన్నిహుతుడైన జేడీయూ నేత శ్రావణ్‌కుమార్‌ మంత్రివర్గంలో చేరడం దాదాపు ఖాయమైంది. స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్‌ సింగ్‌, ఎమ్మెల్సీ నీరజ్‌కుమార్‌ సైతం బెర్తులు ఖరారైనట్లు సమాచారం. వీరితో పాటు భోర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన మదన్‌ సాహ్ని, దామోదర్‌ రౌత్‌, మాజీ ఐపీఎస్‌ అధికారి సునీల్‌కుమార్‌ సైతం మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది.
 
అలాగే బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ ప్రతినిధి షహనవాజ్‌ హుస్సేన్‌, క్రీడాకారిని శ్రేయాసి సింగ్‌ సైతం మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రి, హన్‌జార్‌పూర్ ఎమ్మెల్యే నితీశ్‌మిశ్రా, దర్భాంగా ఎమ్మెల్యే సంజయ్ సరవాగి, బరౌలీ ఎమ్మెల్యే రాంప్రవేశ్ రాయ్‌కు సైతం కేబినెట్‌ బెర్త్‌ ఖాయంగా కనిపిస్తోంది. 
 
ఈ నెల 19న అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ క్రమంలో అంతకు ముందే కేబినెట్‌ను విస్తరించాలని సీఎం నితీశ్‌కుమార్‌ భావిస్తున్నారు. గత శనివారం సైతం బీజేపీ నేత జైస్వాల్‌ సైతం అసెంబ్లీ సమావేశానికి ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రకటించారు.