మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

బీజేపీ అగ్ర నేతల కోరిక మేరకే.. సీఎంగా ప్రమాణం చేస్తున్నా : నితీశ్

బీహార్ ముఖ్యమంత్రిగా సోమవారం సాయంత్రం జేడీయు నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడం తెలిసిందే. ఈ క్రమంలో నితీశ్ కుమార్‌ను బీహార్‌లో ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దాంతో ఆయన మరోసారి సీఎం కానున్నారు. ఆయన సీఎం పీఠంపై కూర్చోనుండడం ఇది నాలుగో పర్యాయం.
 
బీహార్ రాజధాని పాట్నాలోని నితీశ్ కుమార్ నివాసంలో ఆదివారం ఎన్డీయే శాసనసభ్యుల సమావేశం జరిగింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు తమ నేతగా నితీశ్ కుమార్‌నే ఎన్నుకున్నాయి. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే 125 స్థానాలు గెలుచుకుని, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలో కూడిన మహాఘట్ బంధన్ కూటమిని ఓడించింది.
 
ఈ సందర్భంగా నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంగా బీజేపీ అభ్యర్థి ఉంటే బాగుండేదని, కానీ బీజేపీ నేతల కోరిక మేరకే తాను సీఎంగా ప్రమాణం చేయబోతున్నట్టు ప్రకటించారు. తనకు మద్దతిస్తున్న ఎన్డీయే ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు సమర్పించారు. 
 
అంతకుముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాట్నాలో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం అభ్యర్ధిపై చర్చించారు. అయితే ఏ నిర్ణయమూ తీసుకోలేదు. రాజ్‌నాథ్ ఎన్డీయే నేతలతో కూడా సమావేశమయ్యారు. 
 
తమ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్ అని ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. జేడీయూకు బీజేపీ కన్నా తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ నితీశ్ కుమార్‌నే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామని బీజేపీ అగ్ర నేతలు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.