1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 26 జనవరి 2024 (15:05 IST)

బీహార్ రాజకీయాల్లో సంచలనం... 28న జేడీయూ - బీజేపీ కూటమి సర్కారు

nitish kumar
బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయు అధినేత నితీశ్ కుమార్ పల్టీ కొట్టారు. ఇంతకాలం చెలిమి చేసిన ఆర్జేడీని పక్కనపెట్టేశాడు. ఇపుడు మళ్లీ  భారతీయ జనతా పార్టీ చెంతకు చేరారు. ఫలితంగా ఈ నెల 28వ తేదీన బీహార్ రాష్ట్రంలో జేడీయూ - ఆర్జేడీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మరోమారు ఏర్పాటుకానుంది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రిగా సుశీల్ మోడీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 
కాగా, తాజాగా సుశీల్ మోడీ ట్వీట్ చేస్తూ.. మూసుకుపోయిన తలుపులు తెరుచుకోవచ్చు అని పేర్కొన్నారు. రాజకీయాలను ఆయన గేమ్ ఆఫ్ పాజిబిలిటీస్‌గా అభివర్ణించారు. అయితే, అంతకుమించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ఆర్జేడీతో పొత్తుకు నితీశ్ బ్రేక్ చెప్పబోతున్నారంటూ ఒకటే ప్రచారం జరుగుతున్న వేళ తాజా పరిణామాలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. 
 
మరోవైపు, సోషలిస్టు నేత, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఆ తర్వాత బీహార్‌ రాష్ట్ర రాజకీయాలు చకచకా మార్పులు జరిగిపోయాయి. నితీశ్‌ మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. మరోవైపు, బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకం చేసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన తొలి నేత నితీశ్ కుమార్. ఇపుడు ఈ కూటమి నుంచి ఆయనే తొలిసారి వైదొలగడం గమనార్హం.