శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 మే 2021 (18:55 IST)

భర్త కరోనా ఆస్పత్రిలో వుంటే.. సిబ్బంది చున్నీ లాగాడు.. నడుము గిల్లి..?

కరోనా ఆస్పత్రుల్లో కూడా మహిళలపై వేధింపులు చోటుచేసుకుంటూనే వున్నాయి. ఆస్పత్రుల్లోని సిబ్బందితో పాటు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళలపై వేధింపులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా  బీహార్‌ ఆసుపత్రుల్లో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడిస్తూ ఓ మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. 12 నిమిషాలున్న ఈ వీడియో హృదయాలను కలచివేస్తోంది. వైద్యుల నిర్లక్ష్యానికి తన భర్త ఎలా బలైపోయిందీ వివరిస్తూ కన్నీరుమున్నీరుగా విలపించింది. 
 
వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన బాధితురాలు తన భర్తతో కలిసి ఏప్రిల్ 9న బంధువులతో కలిసి హోలీ జరుపుకునేందుకు బీహార్ వచ్చింది. అక్కడ ఆమె భర్తకు జ్వరం రావడంతో రెండుసార్లు కరోనా పరీక్షలు చేస్తే నెగటివ్ వచ్చింది. ఆ తర్వాత ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకుని ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ లోపు డాక్టర్ ఒకరు చెస్ట్‌కు సీటీ స్కాన్ చేయించమని చెప్పారు.
 
అదే సమయంలో ఆమె తల్లి కూడా అనారోగ్యం బారినపడింది. దీంతో ఇద్దరినీ భాగల్‌పూర్‌లోని గ్లోకల్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆమె భర్తకు రెమ్‌డెసివిర్ ఇచ్చే క్రమంలో సిబ్బంది సగం ఇంజక్షన్‌ను వృథా చేశారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించే వారని బాధితురాలు వాపోయింది. ఈ క్రమంలో తన తల్లి ఆరోగ్యం కుదటపడినా భర్త ఆరోగ్యం మరింత క్షీణించిందని, మాట్లాడలేకపోయేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నీళ్లు కావాలని సైగలు చేసిన ఎవరూ ఇచ్చేవారు కాదని పేర్కొంది.
 
గ్లోకల్ ఆసుపత్రిలో జ్యోతి కుమార్ అనే ఒక్క అటెండెంట్ ఉండేవాడని, తన భర్తకు శుభ్రమైన బెడ్‌షీట్లు ఇచ్చేందుకు సాయం చేయాల్సిందిగా అతడిని కోరారని తెలిపింది. అతడు అందుకు సాయం చేయకపోగా, తాను తన భర్తతో మాట్లాడుతున్న సమయంలో వెనక నుంచి వచ్చి తన చున్నీలాగాడని, తాను వెనక్కి తిరిగి చూస్తే వెకిలిగా నవ్వుతూ నడుముపై చేయి వేశాడని ఆరోపించింది. దీంతో భయంతో వణికిపోయానని, తన తల్లి, భర్త అక్కడే చికిత్స పొందుతుండడంతో వారికేమైనా హాని తలపెడతాడేమోనని ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదని పేర్కొంది.
 
వీడియో వెలుగులోకి రావడంతో స్పందించిన అధికారులు విచారణ జరిపి జ్యోతి కుమార్‌ను సస్పెండ్ చేశారు. పాట్నాలోని రాజేశ్వర్ ఆసుపత్రి సిబ్బంది అయితే తన భర్త ఆక్సిజన్ స్థాయులు పడిపోతున్నా పట్టించుకోలేదని ఆక్సిజన్ సరఫరాను నిలిపివేసి బ్లాక్ మార్కెట్ నుంచి కొని తెచ్చుకోమన్నారని వాపోయింది. ఈలోపు పరిస్థితి విషమించడంతో తన భర్త చనిపోయాడని కన్నీరుమున్నీరుగా విలపించింది.